DBN TELUGU:- కారులో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఈ రోజు వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని గోసం బస్తీకి చెందిన రేణుక కుమారుడు రాఘవ (6)తో కలిసి రాకసి పేటలోని హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో కూలి పనులకు వెళ్లారు. ఈ క్రమంలో తల్లి పనుల్లో నిమగ్నమై ఉండగా, కుమారుడు రాఘవ ఆడుకుంటానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. బాలుడు కనిపించక పోయే సరికి తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండు రోజులుగా మిస్సింగ్ అయిన బాలుడు అదే ఏరియాలో పార్క్ చేసిన ఓ కారులో కనిపించాడు. కారు డోర్లు తెరచుకుని ఉన్నప్పుడు బాలుడు అందులోకి వెళ్లగానే కారు ఒక్కసారిగా లాక్ అయింది. దీంతో ఆ చిన్నారి కారులోనే ఊపిరాడక మృతి చెందాడు. గత రాత్రి కారు యజమాని బయటకు వెళ్లేందుకు కారు తీస్తుండగా.. కారులో మృత దేహాన్ని గుర్తించి అతడు స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. ఈ మేరకు బాలుడి మృతదేహాం గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించి, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.