DBN TELUGU:- తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రకటించిన అభ్యర్థుల లిస్టులో జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తిరెడ్డిని ప్రకటించక పోయిన విషయం అందరికీ తెలిసిందే...!
ఇందులో భాగంగానే... జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, టీఎస్ఆర్టీసీ, చైర్మన్ పదవిని ఆయనకు ఇచ్చారు. ఈ సందర్భంగా నేడు హైదరాబాద్ లోని సంస్థ అధికారిక కార్యాలయం బస్ భవన్ లోని తన ఛాంబర్ లో ఆదివారం ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, , ఇతర ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం సన్మానించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం చైర్మన్ ముత్తిరెడ్డి మాట్లాడుతూ.... అనుభవుజ్ఞులైన ఎండీ వీసీ సజ్జనర్, నేతృత్వంలో టీఎస్ఆర్టీసీ అన్ని విభాగాల్లో ముందుకు దూసుకుపోతోందని అన్నారు. తనపై నమ్మకంతో ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందని, తన శక్తి మేరకు సంస్థ వృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు. అలాగే సంస్థ ఉద్యోగులతో తాను ఒకరిగా సమిష్టిగా పని చేసి.. టీఎస్ఆర్టీసీ లాభాల బాటవైపునకు తీసుకెళ్తామని వివరించారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా తనను నియమించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, పురుషోత్తం, వెంకటేశ్వర్లు, వినోద్ కుమార్ తోపాటు చైర్మన్ యాదగిరి రెడ్డి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. టీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముత్తిరెడ్డికి స్థానం లభించకపోవడం తెలిసిందే. కాగా, ముత్తిరెడ్డికి ముందు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఐతే ఆయన పదవీకాలం ముగియడంతో ముత్తిరెడ్డి కి ఈ పదవిని అప్పగించారు. పదవీ స్వీకార కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.