DBN TELUGU:- టీం ఇండియా వన్డే వరల్డ్ కప్ ఆడుతున్న నేపథ్యంలో మంచి ఫామ్ మీద ఉన్న
ఓపెనర్ శుభ్మన్ గిల్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో రానున్న మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డెంగ్యూ బారిన పడిన శుభ్మన్ గిల్ ప్లేట్లెట్స్ కౌంట్ పడిపోవడంతో ఆస్పత్రిలో చేరాడు. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో శుభ్మన్ గల్ అడ్మిట్ అయ్యాడు. వైద్య నిపుణుల సంరక్షణలో చికిత్స అందిస్తున్నారు. బీసీసీఐ వైద్యుడు రిజ్వాన్ ఖాన్ కూడా శుభ్మన్ గిల్ వెంట ఉంటున్నాడు. చెన్నైలోని చేపాక్ స్టేడియం వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లో పాల్గొనేందుకు శుభ్మన్ గిల్ రాగా... అతను అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగ్యూ పాజిటివ్ అని తేలింది. అప్పటి నుంచి చెన్నైలోనే బీసీసీఐ కేటాయించిన హోటల్ గదిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అయితే ఇప్పుడు శుభ్మన్ గిల్ శరీరంలో ప్లేట్లెట్స్ పడిపోవడంతో ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ మేరకు బీసీసీఐ తెలిపింది. ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోయినందున అతనికి రెస్ట్ అవసరం. వైద్యుల సూచన మేరకు తదుపరి మ్యాచ్కు కూడా గిల్ అందుబాటులో ఉండడు అని ధృవీకరిస్తూ బీసీసీఐ ఒక ప్రకటన చేసింది.