DBN TELUGU:- ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
మంగళవారం మధ్యాహ్నం పార్టీ ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, కేశినేని శ్రీనివాస్ నాని కే. రామ్మోహన్ నాయుడుతో పాటు ఆయన రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్న ఆరోపణలతో నారా లోకేశ్ ఒక లేఖను, చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేశారంటూ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఒక లేఖను రాష్ట్రపతికి అందజేశారు. రాష్ట్రపతితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్, 2019 నుంచి ప్రతిపక్ష పార్టీలు, ప్రజలపై జరుగుతున్న అరాచకాల గురించి రాష్ట్రపతికి వివరించామని చెప్పారు. స్కిల్ డెలవలప్మెంట్ పథకంలో ఎలాంటి అవినీతి లేకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారని, ప్రతిపక్ష పార్టీలను కేసుల పేరుతో వేధిస్తున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేశానని వెల్లడించారు. రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారని, ఏపీలో పరిస్థితుల గురించి తెలుసుకుంటామని చెప్పారని లోకేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలతో పాటు సామాన్యుల గొంతును నోక్కే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆరోపించారు. అయినా సరే తమ పోరాటం ఆగదని, పోరాటాన్ని ప్రజా క్షేత్రంలోకి తీసుకువెళతామని తెలిపారు. యువగళం పాదయాత్ర ప్రారంభిస్తామని ప్రకటించిన వెంటనే బహుమతిగా తనను ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14 గా చేర్చారని నారా లోకేశ్ అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు వస్తాయని, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత తాను వ్యక్తిగతంగా తీసుకుంటానని హెచ్చరించారు.