DBN TELUGU:- కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో యువకుడి వేధింపులు తట్టుకోలేక యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... చింతలమానేపల్లి మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన దంద్రే సుప్రియ(18) అనే యువతి అదే గ్రామానికి చెందిన ఎల్కరి అంజన్న అనే యువకుడి వేధింపులు భరించలేక గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం గంగాపూర్ గ్రామానికి చెందిన ఎల్కరి అంజన్న అనే యువకుడు సుప్రియకు తరచూ తన ఫోన్ లో వాట్సాప్ అసభ్య మెసేజ్ లు పెడుతూ తనతో మాట్లాడాలని లేకుంటే మన ఇద్దరి గురించి వాట్సాప్ గ్రూప్ లో పెడుతానని బెదిరించాడు. దీంతో యువతి మనస్థాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. యువతి తల్లిదండ్రులు చేను పనులు ముగించుకొని ఇంటికి రాగానే ఆపస్మారక స్థితిలో ఉన్న కూతురును గమనించి వెంటనే చికిత్స కోసం సిర్పూర్(టీ) సివిల్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించి సుప్రియ మృతి చెందింది. యువతి తండ్రి వెంకన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్కరి అంజన్నకు అదే గ్రామానికి చెందిన జెల్లనాని, రౌతు ఆశన్న, అంజన్నకు సహకరించారని సుప్రియ మృతికి కారణంగా వీరి ముగ్గురి పై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.