DBN TELUGU:- అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా ఖాయమైంది.
ఇప్పటికే సీఎం కేసీఆర్ అభ్యర్థుల జాబితా వెల్లడించగా, అభ్యర్థుల మార్పు ఉండకపోవచ్చనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లు ఎవరిని వరించనున్నాయో మరికొన్ని రోజుల్లో తేలనుంది. టికెట్ల కేటాయింపు కోసం కాంగ్రెస్ పెద్దలు స్వీకరించిన దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మూడు నియోజక వర్గాల్లో సుమారు 27 మంది వరకు కాంగ్రెస్ ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ టికెట్ కోసం పోటీ నెలకొనగా, ఎక్కువగా చెన్నూరు నియోజకవర్గం నుంచి ఆశావహులు దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో వడపోతపై కాంగ్రెస్ పెద్దలు దృష్టి సారించారు. ఈ నెల రెండో వారంలో కాంగ్రెస్ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో ఇప్పటికిప్పుడే అభ్యర్థులను ప్రకటించకుండా చివరి వరకు వేచి చూసే అవకాశాలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మంచిర్యాల లో నలుగురిలో ఎవరిని దక్కుతుందో...?
కాంగ్రెస్ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంచిర్యాల నియోజకవర్గంలో నలుగురు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్రావు, కేవీ ప్రతాప్, వంగల దయానంద్, డాక్టర్ నీలకంఠేశ్వర్ రావు ఉన్నారు. ప్రేంసాగర్రావు ఒక పర్యాయం బరిలో నిలవగా స్వల్ప వ్యత్యాసంతో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్ఠానం అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీగా పని చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలయినప్పటికీ ప్రేంసాగర్రావు నియోజకవర్గంలో కేడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు. ఐదు సంవత్సరాలుగా నియోజక వర్గం మొత్తం తిరుగుతూ పార్టీ పరంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ ప్రజలతో మమేకం అవుతున్నారు. దరఖాస్తుల గడువు ముగిసే సరికి మరో ముగ్గురు నియోజకవర్గం నుంచి టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
బెల్లంపల్లిలో పది మందిలో ఎవరిని దక్కుతుందో...?
బెల్లంపల్లి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్కు ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. నియోజకవర్గం నుంచి ఎప్పుడూ లేని విధంగా ఏకంగా పది మంది అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గడ్డం వినోద్తోపాటు మరో తొమ్మిది మంది టికెట్లు ఆశిస్తున్నారు. వినోద్ కొంత కాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. నియోజకవర్గంలో వినోద్తోపాటు చిలుముల శంకర్, కాంపెల్లి ఉదయ్కాం త్, ముడిమడుగుల మహేందర్, దాసరి విజయ, నాథరి స్వామి, రొడ్డ శారద, గడ్డల హైమవతి, చొప్పదండి భవాని, దుర్గం మోహన్లు దరఖాస్తు చేసుకున్నారు.
చెన్నూరులో 13 మందిలో ఎవరికి దక్కుతుందో...?
చెన్నూరు నియోజకవర్గంలో అత్యధికంగా 13 మంది టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించిన రాష్ట్ర నాయకత్వం బలమైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. నియోజకవర్గంలో పదుల సంఖ్యలో నాయకులు ఎవరికి వారే విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ మాజీ మంత్రి బోడ జనార్దన్తో పాటు సీనియర్ నాయకులు గొమాస శ్రీనివాస్, దుర్గం అశోక్, రామిళ్ల (మేకల) రాధిక, నూకల రమేష్, డాక్టర్ గొడిసెల రాజా రమేష్బాబు, డాక్టర్ దాసారపు శ్రీనివాస్, డాక్టర్ దాసారపు విద్యావర్ధిని, దుర్గం నరేష్, దుర్గం భాస్కర్, సొత్కు సుదర్శన్, మేకల శంకర్, తుంగపిండి రాంచందర్లు టికెట్లు ఆశిస్తున్నారు.
గెలిచే వారి కోసం కసరత్తు...!
కాంగ్రెస్ అధిష్ఠానం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీచేసే ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. దరఖాస్తుల ప్రక్రియ ముగియడంతో కాంగ్రెస్ పెద్దలు నియోజకవర్గాల వారీగా గెలిచే అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ప్రజా ఆకర్షణ, ప్రత్యర్థులను ఎదుర్కొనే సత్తా ఏ నేతకు ఉంది, ఆర్థిక, అంగబలం ఎవరికి ఉన్నాయి, సర్వేలు ఎవరికి అనుకూలం గా వచ్చాయో వాటి ఆధారంగా కాంగ్రెస్ అధిష్ఠానం వడపోత చేపడు తున్నట్లు తెలిసింది. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. వచ్చే నెల రెండో వారం లో టికెట్లు ఖరారు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి వరకు ఎవరికైతే టికెట్ రాదో వారిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే పనిలో పడినట్లు తెలిసింది. పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పరంగా రెబల్గా బరిలో ఉండకుండా అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచా రం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుం దోనని దరఖాస్తు చేసుకున్న ఆశావహులతోపాటు పార్టీ శ్రేణుల్లోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.