DBN TELUGU CHANNEL:- కొత్త సినిమాల, ఓటీటీ కంటెంట్ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగిస్తున్న ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవి, ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు శనివారం చిక్కాడు. ఆయనకు సంబంధించి మూడు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లను ఫ్రీజ్ చేశారు.
కొత్త సినిమాలను థియేటర్ల లో ప్రదర్శించే సమయం లోనే రికార్డ్ చేసి, వాటిని ‘ఐ బొమ్మ’ వెబ్సైట్ లో పెడుతున్నారని, పైరసీ కారణంగా 2023లో భారత సినీ పరిశ్రమకు రూ.22, 400 కోట్లు నష్టం వాటిల్లగాఒక్క తెలుగు సినీ పరి శ్రమే 2024లో రూ.3,700 కోట్లు నష్టపోయిందని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యాంటీ పైరసీ టీమ్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ కేసును చాలెంజింగ్గా తీసుకున్న సైబర్ క్రైం అధికారులు దర్యాప్తు చేసి పైరసీ ముఠాకు చెందిన ఐదుగురు కీలక నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీ సంఖ్యలో పైరేటెడ్ సీడీలను స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో కీలక వ్యక్తి, పట్నాకు చెందిన అశ్వినీ కుమార్, ఇతర నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ‘ఐ బొమ్మ’ అడ్మిన్ ఇమ్మడి రవికి సంబంధించి వివరాలు రాబట్టారు. అతడి కదలికలపై 3 నెలలుగా నిఘా పెట్టారు.
కొంత కాలంగా ఆయన కరీబియన్ దీవుల్లో ఉంటూ ‘ఐ బొమ్మ’ వెబ్సైట్ నిర్వహిస్తున్నాడని తెలుసుకున్నారు. ఇటీవల ఆయన ఫ్రాన్స్ నుంచి కూకట్పల్లిలోని ఇంటికి వచ్చినట్లు గుర్తించారు. వెంటనే దాడి చేసి అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు. అతడి నుంచి పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అతడికి సహకరించిన, నెట్వర్క్లో ఉన్న మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశ మున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరికొన్ని అరెస్ట్లు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఈ కాలంలో వేలాది సినిమాలను అప్లోడ్ చేశాడని దర్యాప్తులో భాగంగా గుర్తించారు. హైఎండ్ టెక్నాలజీని ఉపయోగించి సినిమా ప్రసారం చేసే సంస్థల సర్వర్లు హ్యాక్ చేసేవాడు. డీసీఐ పరికరాలు, హార్డ్ డిస్కులు, మెయిల్స్లో ఉన్న సినిమాను చోరీ చేస్తున్నాడు. ఇందు కోసం రవి హ్యాకర్లకు లక్షలు చెల్లిస్తున్నాడని పోలీసులు తాజాగా గుర్తించారు. మమ్మల్ని ఆపలేరు.. వెతకలేరు’ అంటూ రవి గతంలో పోలీసులకు సవాల్ విసిరాడు. కానీ పోలీసులు వ్యూహాత్మకంగా అరెస్టు చేశారు.
