DBN TELUGU:- తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం స్థానిక నేతలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం సైతం దూకుడు గా వ్యవహరిస్తోంది.
తాజాగా పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. కొత్త ఓటరు జాబితాను ఆగష్టు మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. జాబితా పూర్తయిన వెంటనే నిర్దిష్ట గడువులోగా రిపోర్ట్స్ ఇవ్వాలని బీసీ కమిషన్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో పంచాయతీ ఎన్నికలు జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 31తో గ్రామ పంచాయతీ పాలనవర్గం పదవీకాలం ముగిసింది. ఆగష్టు 1 నాటికి ఆరు నెలలు పూర్తవుతుంది. రాష్ట్రంలో మొత్తం 12769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికీ త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.