DBN TELUGU:- తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో దూకుడు పెంచి, అభ్యర్థుల ఎంపిక కూడా తుది దశకు చేరుకున్నట్లు సమాచారం.
అభ్యర్థుల ఎంపిక విషయంలో సర్వేల ఫలితాలు, నియోజకవర్గాల్లో నేతల పనితీరు, సామాజిక అంశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో రెండు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ భేటీ కావడంతో పాటు దాదాపు 80 మంది అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సీల్డ్ కవర్ లో ఆ జాబితాను పంపినట్టుగా తెలిసింది. ఈ జాబితాను కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పరిశీలించిన తర్వాత ఆమోదం తెలుపనున్నారు. అనంతరం అక్టోబర్ లో కాంగ్రెస్ తొలి జాబితా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. తొలి జాబితాలో కొంతమంది సీనియర్ నేతల పేర్లు కూడా ఉండనున్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు, కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పేర్లతో పాటు పలువురు సీనియర్ నేతల పేర్లు ఉన్నట్టుగా తెలిసింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువ మంది సీటు కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఎవరికి సీటు ఇవ్వాలో కాంగ్రెస్ తేల్చుకోలేకపోతుంది. అలాంటి స్థానాలపై ఆచితూచి వ్యవహారించాలని అధిష్టానం నిర్ణయించింది. అలాగే మరోసారి స్క్రీనింగ్ కమిటీ భేటీ నిర్వహించి ఇలాంటి స్థానాలపై చర్చించి రెండో జాబితాను తయారుచేయాలని నిర్ణయించింది. ఈ నెల 29వ తేదీ సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు స్క్రీనింగ్ కమిటీ పంపిన తొలి జాబితాను పరిశీలించనున్నా రు. అనంతరం తొలి జాబితాను విడుదల చేసే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. దాదాపుగా ఇలా చూసుకుంటే అక్టోబర్ తొలివారంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో మకాం వేసిన ఆశావహులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్కుమార్ రెడ్డిలతో సైతం చర్చలు జరుపుతున్నట్టుగా తెలిసింది. అయితే సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని వారికి టిపిసిసి ముఖ్యనేతలు చెపుతున్నట్లు సమాచారం.